Headlines

భారత దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన వివేకానందుడు. — మాజీ సర్పంచ్ అప్పారెడ్డి.

ప్రపంచంలోనే భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని ఆలమూరు మండలం జొన్నాడ మాజీ సర్పంచ్ ద్వారంపూడి అప్పారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 160వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలమూరు మండలం జొన్నాడ చెరువుగట్టు వద్ద గల వైయస్సార్ జంక్షన్ లో దొరబాబు యువశక్తి సంఘం ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహానికి సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి రామారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి యువజనోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అప్పారెడ్డి మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని కృషి పట్టుదలతో లక్ష్యాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. యువత అంటే ఇనుప నరాలు ఉక్కు కండలు కలిగిన వారిని, భారతదేశం కీర్తి ప్రతిష్టలను విదేశాల్లో సైతం చాటి చెప్పాలన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వివేకానందుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టా శ్రీనివాసు, దొరబాబు యువశక్తి సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి రామారెడ్డి, గొలుగూరి సూరెడ్డి, కర్రి గంగిరెడ్డి, తాడి చిన్న రాము, మేడపాటి వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.