Headlines

ది కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. తీవ్రగాయాలు!

ఏడాదికి ఎన్నో సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. కానీ కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. మరికొన్ని మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ఇక మరికొన్ని వివాదాలకు కేంద్ర బిందువులు అవుతుంటాయి. ఇంకొన్ని గత చరిత్రను తవ్వితీస్తుంటాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఈ అన్ని అంశాలను తట్టింది.. అదే ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా. కాశ్మీర్ లో ఒకప్పుడు జరిగిన దమనకాండను కళ్లకు కట్టేలా వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా తెరకెక్కింది. ఇందులో ఒక వర్గానికి చెందిన వారిని ఎలా దారుణంగా తరిమి వేశారో, ఎలా చంపారో చూపించారు.

అయితే ఈ సినిమా ఎన్నో వివాదాలకు కూడా కేంద్రబిందువు అయింది. ఈ సినిమాలో నటించిన జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషికి కూడా మంచి పేరు వచ్చింది. తాజాగా నటి పల్లవి జోషి కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో ‘వ్యాక్సిన్ వార్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఓ సీన్ కోసం పల్లవి జోషి ఓ కార్ ను చేజ్ చేసిన సీన్ చేయాల్సి ఉంది. ఈ సీన్ లో పల్లవి జోషి నటిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో పల్లవి జోషి తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే చిత్ర యూనిట్ ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్ డేట్స్ అందలేదు. కాగా వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పల్లవి జోషి నటించి అందరినీ మెప్పించడం తెలిసిందే.