మణిపూర్ వేదికగా మిస్ ఇండియా 2023 పోటీలు

మిస్ ఇండియా 2023 పోటీలు మణిపూర్ వేదికగా జరుగనున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందగత్తెల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. అంతిమంగా 30 మంది అందగత్తెలతో తుది జాబితా తయారు చేసిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలను ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రతి యేటా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో 2023 సంవత్సరానికి గాను మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందాల భామలను ఈ పోటీలకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందాల పోటీలు నిర్వహించి 30 మందితో తుది జాబితా తయారు చేసి వారిలో ఒకరిని మిస్ ఇండియాగా ఎంపిక చేస్తామని ఎంఐఓ వెల్లడించింది.

ఇందులో పాల్గొనే అందాల భామలకు కొన్ని అర్హతలను నిర్ణయించారు. వీటిలో…

అందాల భామల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. 5.3 అడుగుల ఎత్తు, ఆపైన (హీల్స్ లేకుండా) ఉండాలి. బరువు 51 కేజీలకు మించరాదు. అవివాహితులై ఉండాలి. ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి ఉండరాదు. గతంలో పెళ్ళి చేసుకుని విడిపోయినా అనర్హులే. ముఖ్యంగా, భారతీయులై ఉండాలి.

భారత్ పాస్ పోర్టు కలిగివుండాలి. ఓవర్సీస్ సిటిజెన్‌షిప్ ఇండియా కార్డు కలిగివున్నవారు కేవలం సెకండ్ రన్నరప్ కోసం పోటీ పడేందుకు అర్హులతవుతారు. పూర్తి వివరాల కోసం www.missindia.com అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ 59వ మిస్ ఇండియా అందాల పోటీలను మణిపూర్‌లో గ్రాండ్‌గా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది.