Headlines

శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరవాయి గ్రామ సచివాలయ పరిధిలోని మళ్ళీ రెడ్డి పల్లి గ్రామంలో నీటి కోసం గ్రామ ప్రజలు పడరాని పాట్లు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరవాయి గ్రామ సచివాలయ పరిధిలోని మళ్ళీ రెడ్డి పల్లి గ్రామంలో నీటి కోసం గ్రామ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.గత వారంరోజుల నుండి అర కిలోమీటర్ దూరం నుండి బిందులతో నీటిని మోసుకెళ్తూ దాహార్తిని తీర్చుకుంటున్నారు.తమ సమస్యను అధికారులు,నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక బుధవారం స్థానిక ఓరవాయి గ్రామసచివాలయాన్ని గ్రామస్తులు ఖాళీ బిందెలతో ముట్టడించారు.సచివాలయంలోకి వెళ్లి మా సమస్యను తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గత వారం రోజుల నుండి బోరు మోటర్ చెడిపోవడంతో దానిని పట్టించుకుని గ్రామస్తుల దాహార్తిని తీర్చే నాయకుడే లేడంటూ అధికారులపై మండిపడ్డారు.ఈ విషయంపై పంచాయతీ సెక్రెటరీ గోపీనాథ్ను వివరణ కోరగా బోరు మోటార్ చెడిపోవడం వాస్తవమేనని ఈ విషయాన్ని గ్రామ సర్పంచి దృష్టికి తీసుకెళ్లామన్నారు.వీలైనంత తొందరలో బోర్ మోటారు రిపేరు చేయించి గ్రామస్తులకు నీటి సరఫరాను అందజేస్తామని పేర్కొన్నారు.గ్రామ సర్పంచును వివరణ కోరగా బోరు మోటారు కాలిపోవడంతో ఈ సమస్య వచ్చిందని రిపేర్ చేయిస్తున్నా మోటార్ ఫీజులు నిలవకపోవడంతో బోర్ మోటార్ కాలిపోతోందన్నారు.బోరు మోటర్ సమస్య ఒక్కటే అయితే ఎప్పుడో అయిపోయేదని మోటార్ లోపల పైపులు కూడా పాడవడంతో సమస్య పరిష్కారం ఆలస్యం అవుతుందన్నారు.వీలైనంత తొందరలో సమస్యను పరిష్కరించి గ్రామస్తులకు నీరందిస్తామని తెలిపారు.