Headlines

అనంతపురం జిల్లాలో పెనుప్రమాదం

అనంతపురం జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. రొద్దం మండలంలో ఆర్టీసీ బస్సుపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడేలా చేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వైర్లు వాహనాలకు ప్రమాదంగా మారాయి. ఇప్పటికే పలు వాహనాలపై ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి.

గతంలో తాడిపర్రి మండల కేంద్రంలో ఆటోపై హైటెన్షన్ వైర్లు పడి ఆటోలోని 5గురు కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఉడుత కారణంగా ఈ వైర్లు తెగి పడినట్లు విద్యుత్ అధికారులు నిర్దారించారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుపై వైర్లు తెగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించకపోయినట్లయితే…తమ ప్రాణాలు గాల్లో కలిసేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.