బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి గంగుల కమలాకర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. కరీంనగర్ లో ప్రచారం నిర్వహించారు.
తాను వందల కోట్లు సంపాదించానని ఆరోపించిన గంగుల.. వాటిని నిరూపించాలని.. అవినీతి పరుడెవరో తేల్చుకుందామా అంటూ బండి సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే తన ఆస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. గంగుల అవినీతి, అక్రమాస్తుల వివరాలను ప్రజల ముందుంచుతానని ప్రకటించారు.
గంగుల అవినీతి చేసినట్లు నిరూపిస్తే అస్తులన్నీ జనాలకు రాసిచ్చేందుకు గంగుల సిద్ధమా..? అని ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధికి ఎవరేం చేశారో టవర్ సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. చాలా మంది వ్యాపారుల కుటుంబాలను గంగుల నాశనం చేసిన చిట్టా తన వద్ద ఉందని సంజయ్ పేర్కొన్నారు. తాను నోరు తెరిస్తే గంగుల కరీంనగర్ లో తిరగలేడని హెచ్చరించారు. కేసీఆర్ ను ఒప్పించి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను కేంద్రంతో మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కాపత్రంతో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఏ రోజు ఏ వ్యాపారస్తుల వద్ద పైసలు వసూలు చేయలేదని… ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. తాను నోరు తెరిస్తే.. ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా గంగులను, తన అనుచరులను వారి ఇంటి గడప కూడా తొక్కనీయరని హెచ్చరించారు. ఇలానే వ్యవహరిస్తే.. వ్యాపారస్తులు గంగులను రోడ్డుమీద కూడా తిరగనీయరని చెప్పారు.
తాను అవినీతికి పాల్పడితే తనకు బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకు ఇస్తుందని బండి ప్రశ్నించారు. తాను అవినీతి పరుడినైతే ప్రత్యేకంగా హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయమంటుందన్నారు. గంగులను బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కే ఎందుకు పరిమితం చేసిందన్నారు. మొదటి విడతలో బీఫామ్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టిక్కెట్ ఇవ్వకపోతే దారుస్సలాం పోయి మోకరిల్లి ఎంఐఎం ద్వారా టిక్కెట్ తెచ్చుకున్నారని విమర్శించారు.