రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు..

రామగుండం పోలీస్ కమిషనరేట్…

పెద్దపల్లి జిల్లా రామగుండం

కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

కమిషనర్ :

ఎం శ్రీనివాస్ IPS…

పెద్దపల్లి రామగుండం :

స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ.స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ…. కొండా లక్ష్మణ్‌ బాపూజీ మహనీయుడని.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేశారని, స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేశారని, దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు. కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. 1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 1967,1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్‌గా, అనంతరం దామోదరం సంజీవయ్య గారి క్యాబినేట్‌లో ఎక్సైజ్‌, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ కోసం ఉద్యమించి, ఉద్యమకారులతో ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో జంతర్‌మంతర్‌లో సత్యాగ్రహం చేయడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారని వారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు .

ఈకార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్ లు రవీందర్, అజయ్ బాబు, ఆర్ఐ దామోదర్, మల్లేశం, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, సూపరిండెంట్ ఇంద్ర సేనా రెడ్డి , మనోజ్ కుమార్ , సంధ్య , సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.