ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త రూల్స్‌

కొద్దిరోజుల కిందటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఉద్యోగులు తమ హాజరును ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోను ఈ వ్యవస్థను పట్టాలెక్కించారు. జనవరి 2వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌ తప్పనిసరి చేశారు. ఉద్యోగులు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని అటెండెన్స్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులతో పాటు డీడీఓలకు యాప్‌ వినియోగంపై మార్గదర్శాలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇదిలా ఉండగానే… ఏపీ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో ఉద్యోగులుంటున్నారా? లేదా..? ఉద్యోగుల పని విధానం, హాజరుపై ఆకస్మికంగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల హాజరుపై తనిఖీలు చేయాలని ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై నిఘా కోసం ఆయా జిల్లాలో చెకింగ్ టీమ్స్ ఏర్పాటయ్యాయి.

జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు తమకు కేటాయించిన ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. హాజరుతో పాటు పని విధానాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా అంశాలను పరిశీలించి ప్రత్యేక బృందాలు నివేదికను రూపొందిస్తాయని సమాచారం. ఇవి జిల్లా కలెక్టర్లకు చేరనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ తీసుకువచ్చిన ముఖ హాజరు విధానాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హాజరు నమోదులో ఆలస్యమైతే జీతం కట్ చేస్తారనే వార్తలపై కూడా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఫీల్డ్‌ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగి ఆందోళన చెందుతున్నారని వారికి టార్గెట్లు పెట్టి, జీతాల్లో కోతలు విధిస్తున్నారని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని వాటిని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో జవాబుదారీతనం కోసం ఈ మధ్యే మరో నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.