ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మార్గదర్శకాల జారీ చేసిన సీఈవో..

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మార్గదర్శకాల జారీ చేసిన సీఈవో

 

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.. ఆ వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాబోతోంది..

 

అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాల జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి.. (ఏపీ సీఈవో).. ప్రభుత్వాఫీసుల్లో ప్రధాని, సీఎం, మంత్రుల ఫోటోలను తొలగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.. కోడ్ అమల్లోకొచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వాఫీసుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని సూచించారు. పొలిటికల్ హోర్డింగులు, పోస్టర్లు, గోడరాతలు తొలగించాలని ఆదేశించింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రోడ్లు, బస్సులు, విద్యుత్ స్థంభాల పైన ప్రకటనలు తొలగించాలని సీఈవో పేర్కొంది..

 

ఇక, ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా నిలిపివేయాలన్న సీఈవో స్పష్టం చేశారు.. కోడ్ అమల్లోకి రాగానే అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలని పేర్కొంది.. కోడ్ అమల్లోకి రాగానే మంత్రులకు ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపేయాలని సూచించింది.. ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులు, అధికార యంత్రాంగం బదిలీలపై పూర్తి నిషేధం అమలు అవుతుందన్నారు సీఈవో మీనా… మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదని వెల్లడించారు. ప్రభుత్వ గెస్ట్ హౌసుల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధుల్ని ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు ఏపీ సీఈవో మీనా..