రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు

రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. అంతేకాదు, మనీ ల్యాండరింగ్ కోసం కనికారెడ్డి ప్రత్యేక విమానాలను సమకూర్చడం ద్వారా సహకారం అందించిన విషయం బయటకు వచ్చింది. ఆమె స్వయాన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి వదిన. అందుకే, విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ టీడీపీ ఆరోపణలను గుప్పిస్తోంది. ఇటీవల టీఆర్ఎస్, వైసీపీ వాడిని ప్రత్యేక విమానాలను కనికారెడ్డి ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఎలాంటి తనిఖీలు లేకుండా గన్నవరం, బేగంపేట నుంచి నేపాల్ తో పాటు పలు దేశాలకు ఫ్లైట్స్ తీసుకెళ్లారని సీబీఐ గుర్తించింది. ఆ సమయంలో మనీ ల్యాండరింగ్ జరింగిందని అనుమానిస్తోంది. అందుకు కింగ్ పిన్ గా శరత్ చంద్రారెడ్డి, ఆయన భార్య ఉన్నారని భావిస్తోంది. సుమారు 100 కోట్ల లంచాలను రాజకీయ నాయకులు, ఢిల్లీ ప్రభుత్వ అధికారులకు మళ్లించారని ప్రాథమిక ఆధారాలను సంపాదించింది.

JetSetGo ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ మరియు నాగ్‌పూర్‌లలో పనిచేస్తుంది. JetSetGo విమాన ప్రయాణీకుల సమాచారం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సీబీఐ లేఖ రాసింది. నిందితులు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన తేదీలను రాబడుతోంది. ఇప్పటికే అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును అరెస్ట్ చేసింది. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టరుగా ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చింది సిబిఐ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెన్నాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది సిబిఐ. లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసిన పెన్నాక శరత్ చంద్రారెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి సమీప బంధువు. శరత్ చంద్రారెడ్డి సోదరుడు పెన్నాక రోహిత్ రెడ్డి స్వయాన విజయసాయి రెడ్డి అల్లుడు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవలే మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాధా ఇండస్ట్రీస్ చైర్మెన్ దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు. పూర్తి సమాచారాన్ని సీబీఐ రాబడుతోంది. తెలంగాణకు చెందిన బోయినపల్లి అభిషేక్, శ్రీనివాసరావు, సీఏ బుచ్చిబాబును అధికారులు ప్రశ్నించారు. వీళ్లంతా ఎమ్మెల్సీ కవిత సన్నిహితులే. దీంతో కవిత టార్గెట్ గానే లిక్కర్ స్కాం విచారణ ముందుకు వెళుతుందనే ప్రచారం సాగుతుంది. నిందితుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారడం, అరబిందో ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడంతో రాబోవు రోజుల్లో విజయసాయిరెడ్డి కుటుంబం ప్రమేయం బయటపడనుందని టీడీపీ చెబుతోంది.

విశాఖ భూముల స్కామ్ కు సంబంధించి ఆయన పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అక్కడి వైసీపీ నాయకుల నుంచి కూడా వ్యతిరేకతను చవిచూశారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయానికి విజయసాయిరెడ్డిని షిప్ట్ చేశారని సర్వత్రా వినిపించే మాట. ప్రస్తుతం ఆయన కేంద్ర పార్టీ ఆఫీస్ లో సమన్వయకర్తగా ఉన్నారు. అయినప్పటికీ దస్పల్లా భూముల స్కామ్ కొత్తగా ఆయన్ను వెంటాడుతోంది. దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబానికి చెందిన వాళ్లు చేసే వ్యాపారాలతో తనకు సంబంధం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. పైగా స్కామ్ లు, అక్రమాల గురించి రాస్తోన్న మీడియాను విమర్శిస్తూ సొంత టీవీ ఛానల్ , పత్రిక పెడతానంటూ సవాల్ విసిరారు.

తొలి నుంచి విజయసాయిరెడ్డిని టీడీపీ టార్గెట్ చేస్తూ వచ్చింది. విశాఖ కేంద్రంగా జరిగిన గంజాయి స్మగ్లింగ్ నుంచి కాకినాడ పోర్ట్ ద్వారా నడిచిన డ్రగ్స్ వరకు ఆయన చుట్టూ ప్రత్యర్థులు తిప్పారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌, విశాఖ భూముల స్కామ్ లు కూడా సాయి చుట్టూ తిరుగుతున్నాయి. కారణం ఏమోగానీ, ఇటీవల విశాఖలో జరిగిన నరేంద్ర మోడీ పర్యటనకు విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని ప్రత్యర్థులు భావిస్తున్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి మీద చేసిన రాజకీయదాడి ఫలించినట్టు విపక్షాలు భావించడం కొసమెరుపు.