జగన్ తో టామ్ అండ్ జెర్రీ గేమ్

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. అయితే మనం వెళ్లే దారి రహదారినా? లేదా నిర్ణయించుకోవాలి. అప్పుడే లక్ష్యం చేరగలం. అందుకే పవన్ కళ్యాణ్ రూటు మార్చాడు. రాజును చెడ్డవానిగా చూపించే బదులు.. జనంలోకి వెళ్లి వారి ఆదరణను చూరగొంటే అధికారం సాధించవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్లాన్ మార్చారు. ఎంత సేపు జగన్ తో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉండడంతో వ్యూహం మార్చి జనాల్లోకి వెళుతున్నారు. ఈ కొత్త ఎత్తుగడ జనసేనలో జోష్ నింపగా.. ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తోంది. వైసీపీని ఓడించాలంటే డైరెక్టుగా జగన్ తోనే తలపాడాల్సిన అవసరం లేదు. జగన్ ను విలన్ ను చేయాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉంటే చాలు.. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని జనసేన అందిపుచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నుంచి నాదెండ్ల మనోహర్ వరకూ ప్రజల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ తన దూకుడు తగ్గించి ట్రాక్ చేంజ్ చేశారు. నాదెండ్ల మనోహర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా జనసేన విజయనగరం జిల్లాపై పడింది.

వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సమస్యలను గుర్తించి పార్టీ నేతలతో చర్చించి వాటిపై పోరాటం చేయడానికి రెడీ అయ్యారు. జగన్ సభలో మహిళల నల్ల చున్నీలు తీసి రమ్మనడాన్ని జనసేన ఎజెండాగా మలిచింది. మహిళలకు జరిగిన అవమానంపై నాదెండ్ల మనోహర్ స్వయంగా అక్కడి వెళ్లి పోరుబాట పట్టారు. ఎక్కడైతే వైసీపీ చేత అవమానించపడ్డారో.. బాధించబడ్డారో ఆ ప్రజలను నేరుగా కలిసి వారికి అండగా జనసేన నిలబడాలని కొత్త స్ట్రాటజీని పవన్ అమలు చేస్తున్నారు. ఇందుకోసం నాదెండ్ల మనోహర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. తనూ పర్యటించేందుకు నడుం బిగించారు. ఇక ఈ శనివారం వైసీపీ ఇప్పటంలో కూలగొట్టించిన ఇళ్ల బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నాడు. దాదాపు 50 మందికి పైగా మనిషికి లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఇలా వైసీపీ బాధితులందరినీ చేరదేసి వారి మనసు గెలిచి ప్రజల్లోకి వెళ్లి మంచి పేరు తెచ్చుకోవాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. నిస్వార్థ సేవ చేసి ప్రజామోదం పొందాలని చూస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే జగన్ ను కొడితే సరిపోదు.. ప్రజల మనసు గెలవాలని పవన్ ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ బి ఎంత మేరకు సక్సెస్ ను ఇస్తుందన్నది వేచిచూడాలి.