బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు.. ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

పెద్దపల్లి :

తెలంగాణ రాష్టం లో

రానున్న కొద్ది సంవత్సరాల్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగాల్లో ఐదు లక్షల మంది శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. బుధవారం నాడు మాసబ్ ట్యాంక్ లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన BFSI-(బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్) నైపుణ్య శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏనాడు నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేసారు. సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించామని శ్రీధర్ బాబు తెలిపారు. 5-6 నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా శ్రమించి ఈ శిక్షణ కోర్సుకు రూపకల్పన చేసిందని వెల్లడించారు. ఇంజనీరింగ్, ఐఐటీ, మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నా బిఎ, బికాం, బిఎస్సీ లాంటి డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఆయన అన్నారు. వీరితో పాటు ఇంజనీరింగ్ చదివినా అవకాశాలు దక్కని వారిని దృష్టిలో పెట్టుకుని నైపుణ్య శిక్షణ కోర్సుకు రూపల్పన చేసినట్టు వివరించారు. తాను ఎక్విప్ (EQUIPPP) అనే సాంకేతిక శిక్షణ అందించే సంస్థను సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం ఉత్సాహాన్నిచ్చిందని వెల్లడించారు. సామాజిక బాధ్యత కింద ఎక్విప్ రూ.2.5 కోట్ల వ్యయంతో ఏటా పదివేల మందికి ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి ముందు కొచ్చిందని తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల ఆఖరి సంవత్సరంలో ఆరు నెలలపాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడానికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ , ఇన్స్యూరెన్సు సంస్థలు సంసిద్ధత తెలిపాయని వెల్లడించారు. దీని వల్ల చదువ పూర్తయి డిగ్రి పట్టా చేతికి అందిన వెంటనే ఉద్యోగావకాశాలు దొరుకుతాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలని శ్రీధర్ బాబు చెప్పారు.