తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. నవంబరు 1 నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను తిరుపతిలో షురూ అవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఇక, వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినా, డిసెంబరు నుంచి మార్పులు చేస్తున్నామని, ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కల్యాణోత్సవం భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైవీ వివరించారు.

సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరాలు తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజ, భూదేవి సత్రాల్లో నవంబరు 1 నుంచి ఈ టోకెన్ల జారీ ఉంటుందని తెలిపారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.

సోమ, బుధ, శని, ఆదివారాల్లో 20,000-25,000 టోకెన్లు జారీ చేస్తామని…. మంగళ, గురు, శుక్ర వారాల్లో 15 వేల చొప్పున టోకెన్లు జారీ చేస్తామని వివరించారు.