ఆంధ్ర తేజం – యువ కెరటం – భవిష్య రాజకీయకరత్నం పాదయాత్రకు శ్రీకారం

తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌, లోకేష్ జాతకాన్ని మార్చేసే ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర చేస్తారా? బస్సు యాత్ర చేస్తారా? అనే సందిగ్ధం ఉండేది. దానికి తెరదింపుతూ యువ కెరటం ప్రజల ముందుకు దూసుకు రాబోతోంది. జనవరి 26న హైదరాబాద్ నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు.

అక్కడ నుంచి 27న పాదయాత్రకు శ్రీకారం చుడతారు. ఎక్కడా విరామం లేకుండా పాదయాత్ర చేయడానికి లోకేశ్ సిద్దం అయ్యారని తెలుస్తోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ యాత్ర సాగనుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే దిశగా పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెలాఖరున పాదయాత్ర విధి విధానాలను ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది.

పాదయాత్రకు సంబంధించి పలు టీమ్ లను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ పాదయాత్ర తరువాత ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర తేదీలు వాయిదా పడ్డాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ పాదయాత్ర లోకేష్ ను తిరుగులేని నాయకునిగా రూపుదిద్దనుంది.