Headlines

రైతు సంక్షేమమే ధ్యేయం : ఏఎంసీ చైర్మన్ సంపత్ 

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 20 :

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సారధ్యంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పని చేస్తుందని ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ఏఎంసీ నూతన పాలకవర్గం తొలి సమావేశం సోమవారం మార్కెట్ యార్డులోని మీటింగ్ హాలులో జరిగింది. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందన్నారు. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల అవసరాలను తీరుస్తున్నారన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బికేల ద్వారా సరఫరా చేయడంతో పాటు రైతు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మన ప్రాంతంలో రైతులు పండించే వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ కమిటీ తన వంతు ప్రయత్నం చేస్తుంది అన్నారు. ట్రేడర్లతో మాట్లాడి వివిధ రకాల ఉత్పత్తులు ఇక్కడ కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయడం ద్వారా రైతు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని చైర్మన్ సంపత్ తెలియజేశారు. ప్రతి రైతు ఇంట పాడి పంటలతో సిరి సంపదలతో విలసిల్లేలా మార్కెట్ కమిటీ కృషి చేస్తుందన్నారు. మార్కెట్ యార్డులో ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారమే కాకుండా మరిన్ని ఉత్పత్తులు రైతుల తీసుకువచ్చి వ్యాపారం జరిగేలా ట్రేడర్లను సమీకరించాలని ఏఎంసీ చైర్మన్ సంపత్ ఆదేశించారు. ఈ సందర్భంగా పుంత రోడ్లు నిర్మాణం, బెల్లం మార్కెట్, పసుపు మార్కెట్, రబీ ముందస్తు సాగు, కాలవలకు నీరు విడుదల తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. వర్షాభావ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని దాల్వాకు సాగునీటి ఎద్దడి రాకుండా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సీలేరు జలాలు తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కాబట్టి జిల్లాలో ప్రతి ఎకరానికి ప్రభుత్వం సాగునీరు అందిస్తుందని ఏఎంసీ చైర్మన్ సంపత్ తెలియజేశారు. అయితే మార్చి నెలాఖరు నాటికి దాల్వా కోతలు పూర్తయ్యేలా రైతులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంకా ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చోడగిరి సత్యనారాయణ (చినబాబు), జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, ఏఎంసీ సెక్రెటరీ ప్రభాకర్ లు మాట్లాడారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గార్లపాటి వీరకుమార్, కర్రి వరహాల రెడ్డి, సలుమూరి సూర్య ప్రకాష్, జాలపర్తి నాగేశ్వరరావు, మద్దుకూరి సుబ్బలక్ష్మి, కండెల్లి వెంకటలక్ష్మి, నీలపాల విజయలక్ష్మి, గోపి కనకదుర్గ, షేక్ వలి భాష, చినమర్తి వెంకటలక్ష్మి, సబిత లక్ష్మీచంద్ర, నున్న శ్రీ నాగలక్ష్మి, దెందుకూరు వెంకట సూర్యనారాయణ రాజు, ఏడిఏ మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ముప్పిడి వెంకట్రామిరెడ్డి (పెద్దబ్బు), కొమ్ముగూడెం, ఆరుగొలను, కుంచనపల్లి సొసైటీల చైర్మన్లు వెలిశెట్టి నరేంద్ర కుమార్, చిక్కాల సత్యనారాయణ, గుమ్మల్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు.