ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ఇవాళ మూడో సెషన్ ప్రారంభమైంది. ఇవాళ “వన్ ఫ్యూచర్” అంశంపై ప్రపంచ దేశాధినేతలు చర్చిస్తున్నారు.
జీ20 సదస్సులో భాగంగా మొత్తం మూడు సెషన్లు జరుగుతుండగా..ఇందులో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ అంశాలపై చర్చించిన నేతలు.. ఇవాళ వన్ ఫ్యూచర్ పై చర్చిస్తున్నారు. అయితే అంతకు ముందు ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించిన ప్రపంచ దేశాధినేతలు మహాత్ముడికి నివాళులు అర్పించారు.
రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇందులో “ఐకానిక్ రాజ్ఘాట్ వద్ద, జీ20 కుటుంబం శాంతి, సేవ, కరుణ మరియు అహింస యొక్క మార్గదర్శి మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. విభిన్న దేశాలు కలిసినప్పుడు, గాంధీజీ యొక్క శాశ్వతమైన ఆదర్శాలు సామరస్యపూర్వకమైన, సమ్మిళితమైన మరియు సంపన్నమైన ప్రపంచ భవిష్యత్తు కోసం మన సామూహిక దృష్టికి మార్గనిర్దేశం చేస్తాయి”. అని పేర్కొన్నారు.
అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పర్యటన ముగించుకుని వియత్నాం బయలుదేరి వెళ్లిపోయారు. దీంతో బైడెన్ లేకుండానే మిగతా జీ20 దేశాధినేతలు సదస్సులో భాగంగా మూడో సెషన్ అయిన వన్ ఫ్యూచర్ పై చర్చిస్తున్నారు. ఇప్పటికే జీ20 సదస్సుకు సంబంధించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం రావడంతో దీన్ని లాంఛనంగా అమోదిస్తున్నట్లు ఆయా దేశాధినేతలు ఓ ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇవాళ సదస్సు రెండో రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్ఘాట్కు జీ20 నేతలు, ప్రతినిధి బృందం అధిపతులను తీసుకెళ్లారు. మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన భక్తిగీతాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అక్కడ వారు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబరు 9న న్యూఢిల్లీలోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైన జీ20 లీడర్స్ సదస్సు ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యుడిగా స్వాగతించింది. అలాగే జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న భారతదేశం ‘వన్ ఎర్త్’ను హైలైట్ చేసింది.