Headlines

బీసీలను అందరూ మోసం చేశారు.. అండగా నిలిచింది బీజేపీ మాత్రమే..

ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంకో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తామన్నారు.

జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలను అందరూ మోసం చేశారని.. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించి వారికి అండగా నిలిచింది బీజేపీ మాత్రమేనన్నారు. అన్ని బీసీ కులాలు, సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

బీఆర్ఎస్ గెలిస్తే దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. దళితులకు పాలన చేయడం చేతకాదని, అందుకే తానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నానని వారిని అవమానించారన్నారు. దళితులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బీఆర్ఎస్‌ది అంటూ ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి అయిదేండ్లలో మంత్రి వర్గంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి బీసీలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. దీనివల్ల బీసీల సీట్లు ముస్లింలకు పోయాయయన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేబినేట్ నిర్ణయం తీసుకుని ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. మైనార్టీ, దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనని ఆయన పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ మజ్లీస్‌ను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పీడ విరగడ అయిందనుకుంటే బీఆర్ఎస్ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఒవైసీ అనుమతి లేనిదే హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఆయన ఎద్దేవా చేశారు. మజ్లీస్ పార్టీ అండదండలతో హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో కరెంట్, నీళ్ల బిల్లులు కూడా కట్టడం లేదన్నారు. రౌడీయిజం, గూండాయిజాన్ని మజ్లీస్ పెంచి పోషిస్తోందని అని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సంఘ విద్రోహ శక్తులు, అరాచకాలు చేసే వారిపై యూపీలో యోగి సర్కార్ తరహాలో బుల్డోజర్లు దింపుతామన్నారు. అది మజ్లీస్ అయినా, అక్రమాలు చేసే వారు ఎవరైనా సరే బుల్డోజర్లు దింపుతామన్నారు.