Headlines

విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై అవగాహనను పెంచుకోవాలి..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 29:

 

విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై ప్రతి ఒక్కరు అవగాహనను పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ క్షన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ (విజయవాడ) జి.సుమంత్ సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, ఆంద్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రమాణాలు అండ్ లేబులింగ్ అనే అంశంపై బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నిట్ డీన్ అకడమిక్ డాక్టర్ టి.కురుమయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ఏసీ, ఫ్రిజ్, టీవీ, ప్రింటర్, కంప్యూటర్లకు స్టార్ రేటింగ్ కలిగిన పరికరాలను ఉపయోగించడం ద్వారా విద్యుత్తును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. 4, 5 స్టార్ రేటింగ్ కలిగిన ఎల్ఈడి బల్బులను వినియోగించడం ద్వారా 30 నుంచి 50 శాతం వరకు విద్యుత్తును ఆదా చేసుకోవసచ్చని వివరించారు. సిరి ఎక్సర్జీ అండ్ కార్బన్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (హైదరాబాద్) డైరెక్టర్ జి.సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యుత్తును పొదుపు చేసేందుకు అత్యుత్తమమైన ఇంధన సామర్థ్యం కలిగిన గృహోపకరణాలను ఉపయోగించాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్ ఉపకరణాల వినియోగాన్ని ప్రభుత్వాలు సైతం ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. విద్యుత్తును ఆదా చేసి రాబోయే తరాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. ఎనర్జీ ఎక్సఫర్ట్ అక్రిటేటెడ్ ఎనర్జీ ఆడిటర్ (హైదరాబాద్) ఐ వి రమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్తును పొదుపు చేసి భవిష్యత్తుతరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. అనంతరం విద్యుత్తును ఎలా ఆదా చేయాలనే విషయాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాదిపతి డాక్టర్ తేజావతు రమేష్, ఆచార్యుడు డాక్టర్ పెద్దపాటి శంకర్ కో ఆర్డినేటర్లుగా వ్యహహరించారు. విద్యుత్ పై క్విజ్ పోటీలను నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు స్మార్ట్ ఎల్ఈడి బల్బులు, కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ శ్రీ ఫణి కృష్ణ కరి, ఎనర్జీ ఇంజనీర్లు వినోద్ బాబు, భారత్ కుమార్ తోపాటు నిట్, శశి, వాసవి ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 250 విద్యార్థులు పాల్గొన్నారు.