పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, డిసెంబర్ 2:
ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ద్వారా పెద్ద మొత్తంలో చేర్పులు, మార్పులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రేపు డిసెంబరు 3న కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిఎల్ఓలు రిజిష్టర్లు, క్లెయిములు, ధరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతీఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. ప్రత్యేక నమోదు కార్యక్రమంలో ప్రధానంగా దీనిపైనే దృష్టి సారించాలని సూచించారు. అలాగే డోర్ టు డోర్ సర్వేని అత్యంత పకడ్బంధీగా నిర్వహించాలని, ప్రతీ ఇంటికీ బిఎల్ఓలు తప్పనిసరిగా వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఒకే డోర్ నెంబరులో పదిమంది కంటే ఎక్కువగా ఉన్న ఓటర్లు, సున్నా లేకా తప్పుడు డోర్ నెంబర్లు నమోదైన ఇళ్లకు వెళ్లి, తనిఖీ చేసి జాబితాల్లో సరిచేయాలని సూచించారు. మరణించిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి, నోటీసులు ఇచ్చి వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. ఎటువంటి తప్పులు లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.