Headlines

నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధత పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

పత్రికా ప్రకటన
తేదీ. 30.10.2023
నిర్మల్ జిల్లా

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధత పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
పోలింగ్ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడనుండగా, నవంబర్ 10వ తేదీ నామిమేషన్లు దాఖలు చేసేందుకు చివరి గడువు అని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, కార్యాలయంలో ఒకే గడియారం ఉండాలని అన్నారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వెంటవెంటనే ఆన్ లైన్ యాప్ లో నామినేషన్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న ఫ్రీ గుర్తులను మాత్రమే కేటాయించాలని అన్నారు.
నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత అవసరమైన బ్యాలెట్ పేపర్ల తయారీ, బ్యాలెట్ యూనిట్లు పోస్టల్ బ్యాలెట్స్ సిద్దం చేసుకోవాలని, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే సెక్టార్ అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, లైటింగ్, టాయిలెట్స్ వంటి అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతుల కల్పన పై శ్రద్ధ వహించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవల సిబ్బంది కి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.
జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు.
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే అప్పీళ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.ఎన్నికల విధులు సకాలంలో నిష్పక్షపాతంగా నిబంధనల మేరకు నిర్వహించాలని, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పాలనాధికారి ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పి ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఫామ్-6,7,8 లను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నమైన నిమిషాల వ్యవధిలో చేరుకొని పరిష్కరించే విధంగా సమీకృత కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ . చే జారీ చేయనైనది.