Headlines

చిరంజీవిపై ప్రేమతో ప్రధాని మోడీ …!

దేశానికి ప్రధాని అయినా మోడీలో ఒక మంచి గుణం ఉంది. ఎక్కడ ఎవరు టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నా వారిని మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని మరీ అభినందిస్తుంటారు. ఇందుకోసం ఆయన ట్విటర్ ను వాడుతుంటారు. ప్రముఖల యాప్ అయిన ట్విటర్ లో తాజాగా చిరంజీవి గురించి తెలుగులో గొప్పగా పొగడడం సినీ, రాజకీయ అభిమానులను ఎంతో సంతోష పరిచింది. టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్ చేరింది. చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’ అవార్డ్ వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. గోవాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివెల్ లో దీన్ని ప్రధానం చేయనున్నారు.

చిరంజీవికి కేంద్రం నుంచి ఈ అవార్డ్ దక్కడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఏకంగా తెలుగులో ట్వీట్ చేసి మరీ అభినందించారు. ‘చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతోపాటు విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణను పొందుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు నా అభినందనలు’ అంటూ మోడీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. దీంతో చిరంజీవి ఖ్యాతి దేశమంతా ఇనుమడించినట్టైంది. గోవాలోని పనాజీలో ఆదివారం ప్రారంభమైన ‘ఇఫి’ వేడుకలు ఈనెల 29వరకూ సాగుతాయి. మంచి కంటెంట్ తో రూపుదిద్దుకున్న పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక సినీ ఇండస్ట్రీ కోసం పాటు పడ్డ సినీ ప్రముఖులకు పురస్కారాలు అందజేసి గౌరవిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దేశంలోని కళాకారులకు వీటిని అందజేస్తుంది.