Headlines

APలో పెన్షన్ల పెంపు.టీచర్ల బదులు సచివాలయ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ లబ్దిదారులకు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచనున్నారు. రాష్ట్రంలో పెన్షన్ దారులకు ఇచ్చే పెన్షన్‌ రూ.2750కు చేరనుంది.

పెన్షన్ మొత్తం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల రూ.130 కోట్లు అదనంగా ఖర్చు కానుందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. పెన్షన్‌ చెల్లింపుల కోసం ప్రతినెల 1720 కోట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు. కొత్తగా చేర్చిన వారితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 64.74లక్షల మందికి ప్రతినెల రూ.2750 చొప్పున పెన్షన్ చెల్లించనున్నారు.

పెన్షన్‌ చెల్లింపుల కోసం ఇకపై ఏపీలో ప్రతినెల నెలకు రూ. 1786కోట్లు ఖర్చు కానుంది. గత ప్రభుత్వంలో నెలకు రూ.400కోట్లు మాత్రమే పెన్షన్లుగా చెల్లించేవారని మంత్రి చెప్పారు. రూ.400కోట్ల నుంచి రూ.1786కోట్ల రుపాయలకు చెల్లింపులు పెరగనున్నాయని, ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయంలో రాష్ట్రంలో 39లక్షల మంది లబ్ది దారులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 64.74లక్షల పెన్షన్ లబ్దిదారులు పెరిగారని మంత్రి చెప్పారు.

సంక్షేమ పాలనలో భాగంగా ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాన్ని పొందలేకపోతే వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సోషల్ ఆడిట్ ద్వారా నవరత్నాలను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్తగా 2.63 లక్షల మందికి పెన్షన్లను అందించనున్నారు. ఇందుకోసం అదనంగా 403కోట్ల రుపాయల విలువైన పథకాలను డిసెంబర్ 27న లబ్దిదారులకు అందచేయనున్నారు.

కొత్తగా 2.63లక్షల పెన్షన్లు, 44,543 రేషన్ కార్డులు, 14,441 ఆరోగ్య శ్రీ కార్డులు, 14,531 ఇళ్ళ పట్టాలు, 65 కోట్ల పంట నష్టం భీమా సొమ్మును డిసెంబర్ 27న లబ్దిదారులకు అంద చేయనున్నారు. గతంలో పథకాలు ప్రవేశపెట్టి ఎలా తగ్గించాలని ఆలోచించే వారని, ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందించాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి చెల్లుబోయిన చెప్పారు.

డిసెంబర్‌ 21న విద్యార్ధులకు ట్యాబ్‌లు …

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్ధులకు డిసెంబర్ 21న ట్యాబ్‌లను అందచేయనున్నారు . దీంతో పాటు పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీల ఏర్పాటుకు రూ.50కోట్లు కేటాయించారు. 8వ తరగతి విద్యార్ధులకు “ఈ” కంటెంట్ అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని సిఎం జన్మదినం సందర్భంగా లాంఛనంగా ప్రారంభింస్తారు. రాష్ట్రంలోని 4.6లక్షల మంది 8వ తరగతి విద్యార్ధులతో పాటు 60వేల మంది టీచర్లకు శాంసంగ్ ట్యాబ్‌లను పంపిణీ చేస్తారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా ట్యాబ్‌లను సిద్ధం చేశారు. రూ.668కోట్ల విలువైన ట్యాబ్‌లను ప్రభుత్వం అందిస్తుండగా, బైజూస్ సంస్థ రూ.700కోట్ల విలువైన కంటెంట్‌ను వాటిలో పొందుపరచినట్లు మంత్రి తెలిపారు. మూడున్నరేళ్లలో విద్యార్దులకు అత్యంత విలువైన కంటెంట్‌ అందుతుందని మంత్రి తెలిపారు.

ఉపాధ్యాయుల స్థానంలో సచివాలయ ఉద్యోగులు…

ఏపీలో బోధనేతర పనులకు ఉపాధ్యాయులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఉపాధ్యాయులను బోధన పనులకు మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్న బోధనేతర పనుల కోసం 1.30వేల మంది సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని రాష్ట్ర క్యాబినెట్‌లో నిర్ణయించారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారని మంత్రి తెలిపారు.

మరికొన్ని క్యాబినెట్ నిర్ణయాలు..

ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో పలు తీర్మానాలకు మంత్రి వర్గ సభ్యులు అమోద ముద్ర వేశారు. ఉచిత పంటల భీమా పథకంలో భాగంగా, పిఎం ఫసల్ భీమా యోజనలో సవరణకు మంత్రి మండలి అమోదం తెలిపింది. నెల్లూరులో మేకపాటి గౌతమ్‌ రెడ్డి వ్యవసాయ కాలేజీలో 52 టీచింగ్, 56 నాన్‌ టీచింగ్‌ మొత్తం 108పోస్టులు మంజూరు చేశారు. మేకపాటి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలకు క్యాబినెట్ అమోదం తెలిపింది. 2022 సంవత్సరంలో జూన్‌ 1న నీటిని విడుదల చేయడం ద్వారా లబ్ది చేకూరిందని, నీటి వినియోగ విధనానికి మంత్రి మండలి అమోదం తెలిపింది.