Headlines

తాండూరు కందికి జిఐ గుర్తింపు. మంత్రి నిరంజన్ అభినందనలు

తెలంగాణలోని తాండూరు ప్రాంతంలో సాగు అవుతున్న కంది పంటకు విశిష్ట గుర్తింపు లభించింది. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలోని లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగు చేస్తున్నారు. దేశమంతటా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుండి వెయ్యి ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా తాండూరు ప్రాంతంలో సాగు చేసే కంది పంటకు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించింది. ఆజాది కా అమృత్ ఉత్సవాలలో భాగంగా 75 ఉత్పత్తులు జిఐ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది వచ్చిన ధరఖాస్తులలో కేవలం 9 ఉత్పత్తులకు గుర్తింపు లభించగా అందులో తాండూరు కంది ఒకటి కావడం గమనార్హం. తాజాగుర్తింపుతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతానికి 16 ఉత్పత్తులకు గుర్తింపు లభించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు లభించింది. పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్(2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) జియెగ్రాఫికల్ ఐడెంటిటీ గుర్తింపు పొందిన వాటిలో ఉన్నాయి. ఇప్పటి వరకు గుర్తింపు లభించిందిన మామిడి, కంది ఉద్యాన, వ్యవసాయ రంగ ఉత్పత్తులు కావడం విశేషం.

వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండడం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకతలుగా ఉన్నాయి. తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమని గుర్తించారు. దేశంలోని ఢిల్లీ, ముంబయి, కోల్ కతాలలో తాండూరు కంది బ్రాండ్ కు డిమాండ్ భారీగా ఉంది. తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు కోసం యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం మరియు తాండూరు కంది పరిశోధనా స్థానం తరపున దరఖాస్తు చేశారు. భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ లను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తిం పు (జియోలాజికల్‌ ఐడెంటిఫికేషన్‌) కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసింది. తెలంగాణలో ఇప్పటికే పదిహేను ఉత్పత్తులు, వస్తువులు జీఐ గుర్తింపును పొందాయి. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యంగల తాండూరు కందిపప్పు, నిజామాబాద్‌ పసుపు, బాలానగర్‌ సీతాఫలం, వరంగల్‌ మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాండూరు కందిపప్పు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది.