Headlines

తెలంగాణ లోగోలు ఇవే..!

జూన్ 2వ తేదీన ఆవిర్భావ దశమ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వసన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటోంది.

 

ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశ రాజధానిలో ఆమెతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. దీనికి సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు.

 

ఇవే ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించబోతోంది. దీనికోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. లోగోతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్నీ విడుదల చేస్తారు అదే రోజున. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

 

తెలంగాణ లోగోను ఖరారు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నేడు ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరామ్, ఈ లోగోను డిజైన్ చేసిన రుద్ర రాజేశం.. ఇతరులు ఇందులో పాల్గొన్నారు.

 

రాచరికపు ఆనవాళ్లు లేకుండా.. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా చిహ్నాన్ని రూపొందించాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అధికారిక చిహ్నానికి బదులుగా కొత్త ఎంబ్లమ్‌ను వినియోగిస్తారు ఇకపై. దీనికి సంబంధించిన మూడు లోగోలను ప్రభుత్వం వడపోసింది. ఇందులో ఒకదాన్ని ఎంపిక చేయాల్సి ఉంది.

 

1. ఈ మూడు చిహ్నాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. లోగో పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది. కింది భాగంలో చార్మినార్ కనిపిస్తుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం.. అనే అక్షరాలు నాలుగు భాషల్లో అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. మధ్యలో పూర్ణకుంభం.. చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్ చేశారు.

 

2. లోగో పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది. కింది భాగంలో ట్యాంక్‌బండ్‌లో ఉండే గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం.. అనే అక్షరాలు మూడు భాషల్లో అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. మధ్యలో తెలంగాణ రాష్ట్ర మ్యాప్, అందులో పూర్ణకుంభం.. చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్ చేశారు.

 

3. లోగో పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం.. అనే అక్షరాలు మూడు భాషల్లో అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. మధ్యలో పైభాగంలో నీలం రంగులో ఆరు ఆకులు, కింది భాగంలో పారిశ్రామిక ప్రగతిని సూచించే చట్రాన్ని పొందుపరిచారు. ఈ మూడింట్లో తొలి/మలి డిజైన్లల్లో ఒకటి ఖరారు కావొచ్చని తెలుస్తోంది.