Headlines

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్..

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

పీర్జాదిగూడలో నాలుగు రోజుల క్రితం రూ. 4.50 లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. అయితే ఆమెకు సంబంధించినన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. అయితే ఇప్పటికే ఈ ముఠా 16 మంది చిన్నారులను విక్రయించినట్లు తెలుస్తోంది.

 

ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు తెలిపారు. దీనితో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో శోభరాణి, సలీం, స్పప్నలను అరెస్టు చేశాం అని సీపీ చెప్పారు. సంతానం లేని వారికి వీరు పిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.

 

ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ ముఠాకు సంబంధించి ఢిల్లీ, పుణెలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ముఠా తల్లిదండ్రల నుంచి పిల్లలను కొనుగోలు చేసి.. రూ. 1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు.