Headlines

అధికారుల నిర్లక్ష్యం, స్కూల్స్ ఓపెన్, పుస్తకాలు వెనక్కి..!

విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా, అధికారులు మాత్రం పాత ప్రభుత్వమనే భ్రమల్లోనే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడంలేదు. దాని ఫలితమే తెలంగాణలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది?

 

తెలంగాణలో బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబిత ఇంద్రారెడ్డి పేర్లు యధాతధంగా ఉంచేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనికి బాధ్యులు ఎవరన్నదానిపై విచారణ మొదలైంది.

 

పాఠ్య పుస్తకాలను కనీసం చూడకుండా పంపిణీ చేయడంపై విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది. అయినా అధికారులు ముందుమాట మార్చకపోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఈ క్రమంలో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను ఉపాధ్యాయులు వెనక్కి తీసుకున్నారు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.