Headlines

విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడంపై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడంపై ఏపీ విద్యాశాఖ వివరణ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడంపై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడంపై ఏపీ విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ట్యాబ్‌ల కొనుగోళ్లలో రూ.187 కోట్లు ఆదా చేస్తే రూ.221 కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు. విద్యారంగంలో డిజిటల్ విప్లవాన్ని ఆపేందుకు టీడీపీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబ్ ల కొనుగోలులో రూ.221 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఖండించింది. టెండరింగ్ పద్దతిలో ఏపీ ప్రభుత్వం 5.19 లక్షల ట్యాబ్ల కొనుగోలు లో రూ.187 కోట్లు ఆదా చేసినా అధిక ధర చెల్లించారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 21 వ తేదీన బాపట్ల జిల్లా యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.32 వేల విలువైన ప్రీ అప్ లోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు కు రూ.1466 కోట్లు ఖర్చు చేశారు. టెండరింగ్ పద్దతి ద్వారా రూ.187 కోట్లను ఆదా చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు ట్యాబ్‌ల కొనుగోళ్లలో వందల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేత కె. పట్టాభిరామ్‌ ఆరోపించడాన్ని ప్రభుత్వం తప్పు పడుతోంది. పేద విద్యార్థులకు డిజిటల్ చదువులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు తూట్లు పొడిచేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో పట్టాభి తప్పుడు ఆరోపణలు చేయ్యడాన్ని విద్యాశాఖ ఖండించింది. ట్యాబ్ ధర అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో రూ.14,500 ఉండగా.. టెండర్ ప్రక్రియ ద్వారా ఒక్కో ట్యాబ్‌ను రూ. 12,843 ధరకే కొనుగోలు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ధర కంటే ఇది రూ.3,603 (22%) తక్కువకే కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ట్యాబ్‌తో పాటు, ఫ్లిప్ కవర్, 64 జీబీ మెమరీ కార్డ్, ఓటీజీ కేబుల్ మూడేళ్ల వారంటీ కార్డ్‌తో సహా బైజూస్‌ కంటెంట్‌ లోడ్ చేసి విద్యార్థులకు అందించినట్లు విద్యా శాఖ తెలిపింది. ట్యాబ్ మొత్తం ధరలోనే మిగిలిన అన్ని వస్తువులతో కలిపి కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా, ఏపీలోని ప్రతి మండల ప్రధాన కార్యాలయం వరకు రవాణా ఖర్చు కూడా ఈ ధరలోనే కలిపి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. ట్యాబ్ ల కొనుగోలు కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో నాలుగు జాతీయ మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు పాల్గొన్నాయని మరియు టెండర్ అవార్డులో ఎటువంటి పక్షపాతం లేదని విద్యాశాఖ తెలియజేసింది.