Headlines

బస్సు ఛార్జీల పెంపు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ..!

తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద ఈ ఫీజులు స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 పెంచారని వార్తలు వచ్చాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17. నాన్-ఎసి స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కి.పెరిగినట్లు వార్త కథనాలొచ్చాయి.

 

దీనిపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. సాధారణ ఛార్జీలపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఆర్టీసీ బస్సు సాధారణ చార్జీలు యథాతథంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇటీవల హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించిందని చెప్పారు.

 

జూన్ 3వ తేదీ నుంచి సవరించిన టోల్ సెస్ అమల్లోకి వచ్చిందని సజ్జనార్ వివరించారు. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించిందని గుర్తు చేశారు. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని వివరించారు. టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

 

సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం టీజీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ చెప్పారు.