Headlines

టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి అందరికి ఆదర్శం కావాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి అందరికి ఆదర్శం కావాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం,  :

స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, తదితరులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘననివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టడం జరిగిందన్నారు. 1940-50వ దశకంలో ఆంధ్రా రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకమైనదని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ధనికుల ఇళ్ళల్లో వారాలు చేసుకొని కష్టపడి చదువుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయమన్నారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు, పోలీసు తూటాలకు గుండెనొగ్గిన సంగతులను వివరించారు. ప్రకాశం పంతులు ఇచ్చిన స్ఫూర్తి, ఆశయసాధన అందరికీ ఆదర్శ కావాలన్నారు. రాష్ట్రంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీని, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీని వారి హయాంలోనే నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. వారి వ్యక్తిత్వం ద్వారా స్ఫూర్తి పొందాలన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు మాట, బాటలలోనే అందరూ అడుగులు వేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం పంతులు త్యాగ నిరతి, అశయాలు, వ్యక్తిత్వం ద్వారా స్ఫూర్తి పొందాలన్నారు. టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించారన్నారు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు, తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలు చేసుకొని చదువు కొనసాగించారన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు స్వయంగా పర్యటించి పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేశారన్నారు. తొలుత కొంత మంది విద్యార్థులు ప్రకాశం పంతులు జీవిత చరిత్ర, చేసిన సేవలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె. కృష్ణ వేణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.వి.అర్.కె.ఎస్.ఎస్ గణపతిరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.