Headlines

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ఆగి ఉన్న రైలును ఢీకొన్న పలాస ఎక్స్ ప్రెస్

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంటకాపల్లి వద్ద నిలిచిపోయింది.

సరిగ్గా అదే సమయంలో దాని వెనుకే అత్యంత వేగంగా వచ్చిన విశాఖ-పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్‌కు చెందిన నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదస్థలిలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అంధకారంగా మారింది. ఘటనా స్థలానికి పోలీసులు, అత్యవసర సిబ్బంది చేరుకుంటున్నారు. ఈ ప్రమాదం జరగడంతో రైలులో ఉన్న ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉండొచ్చని తోటి ప్రయాణీకులు భావిస్తున్నారు.

 

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైతుల ప్రమాద దుర్ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని.. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.