Headlines

పింఛన్ల తొలగింపును నిలిపివేయాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రికి లేఖ

పింఛన్ల తొలగింపును నిలిపివేయాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అధికార పీఠాన్ని ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరు ఇచ్చిన హామీలు మరిచిపోయారా అని లోకేష్ ప్రశ్నించారు. గద్దె ఎక్కినప్పటి నుంచి పింఛన్ల నయవంచనకి దిగారని, తెలుగుదేశం ప్రభుత్వం రూ.200 ఉన్న పింఛనుని పదిరెట్లు పెంచి రూ.2000 చేస్తే, వైసీపీ రూ.3000 పింఛను చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వయోపరిమితి నిబంధనలతో సుమారు 18.75 లక్షల పెన్షన్లను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి పింఛన్ నయవంచనకి దిగడం ప్రభుత్వానికి న్యాయమా అని ప్రశ్నించారు. పెంచాల్సిన పింఛన్ సొమ్ము పెంచలేదని, ఏళ్లుగా వస్తున్న పింఛన్లనే రద్దు చేసేందుకు అడ్డగోలు నిబంధనలతో నోటీసులు ఇస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది పింఛన్లను రద్దు చేయాలనుకోవడం అన్యాయమన్నారు. 20 ఏళ్ల నుండీ పెన్షన్లు పొందుతున్న అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు ఆసరా తొలగించి ఉసురు తీయొద్దని వేడుకోవడం వినిపించడం లేదా అని నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం మారడికోట పంచాయతీలో సెంటు భూమి లేని నిరుపేదలకు వేల ఎకరాలున్నాయని పింఛన్లు తొలగించారని, వారికి పింఛన్లు ఇవ్వొద్దని, వేల ఎకరాలలో 90 శాతం మీరు తీసుకుని 10 శాతం భూములైనా ఇప్పించాలని ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిరుపేద మహిళకు 158 ఇళ్లు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారని, ప్రభుత్వం ధ్రువీకరించిన 158 గృహాలు రామక్కకి అప్పగించాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమనాపల్లికి చెందిన సత్యశ్రీ భర్త మూడేళ్ల క్రితం మరణిస్తే, ఆయన పన్ను కడుతున్నారని పింఛన్ నిలిపేశారని, పింఛను ఇవ్వకపోయినా సత్యశ్రీ భర్తని బతికించి తీసుకురావాలన్నారు.

పెన్షన్ తీసేశారనే ఆందోళనతో చిత్తూరు జిల్లాకి చెందిన శెట్టియార్ గుండెపోటుతో మృతి చెందారని, కాకినాడకి చెందిన శ్రీను సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాడనే ఒకే ఒక కారణంతో పదేళ్ల నుంచి దివ్యాంగులైన పిల్లలకు ఇస్తున్న పింఛను నిలిపేయడం మానవత్వమేనా అని ప్రశ్నించారు. పింఛను తీసేయడానికి చూపిస్తున్న భూములు, భవనాలు, ఆస్తులన్నీ ఆయా లబ్దిదారులకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు, వితంతువులకు ఇప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరడం విడ్డూరమన్నారు. సదరం పత్రాలు జారీ నిలిపేసి, దివ్యాంగులు ఆ పత్రాలు తేవాలని నిబంధన పెట్టడం పింఛన్లకి కోత వేయడానికేనని లోకేష్‌ ఆరోపించారు. నిరుపేదలకు లేని కారు, పొలం, ఇల్లు, ఆస్తులు ఎలా సృష్టిస్తున్నారని, కుటుంబంలో ఎవరో ఒకరు ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారని, 300 యూనిట్ల విద్యుత్ వాడారని నిరాశ్రయులైన వారి పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి మానవత్వంతో ఆలోచించాలని అవ్వాతాతల జీవితాలకు వెలుగునిచ్చే చిరుదీపాన్ని ఆర్పే ప్రయత్నం చేయొద్దని, దివ్యాంగులకు ఆసరాగా నిలిచిన పింఛనుని లాక్కోవద్దని హితవు పలికారు. పెన్షన్ల రద్దుని ఆపాలని, ఇదివరకే రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.